జాగ్రత్తగా అన్‌‌‌‌లాక్..

జాగ్రత్తగా అన్‌‌‌‌లాక్..
  • గ్రౌండ్ ​లెవల్‌‌‌‌‌‌‌‌లో పరిస్థితిని బట్టి సడలింపులు ఇవ్వాలె: కేంద్రం
  • రాష్ట్రాలు, యూటీలకు సూచన
  • ఆంక్షలు సడలించడం వల్ల జనం గుమిగూడే చాన్స్
  • కరోనా రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి
  • వైరస్​ చైన్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్ చేసేందుకు వేగంగా టీకాలు వేయాలి

న్యూఢిల్లీ, వెలుగు: ‘‘ఆంక్షలు సడలించడం వల్ల మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో జనం ఎక్కువగా గుమిగూడే ప్రమాదం ఉంది. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు జనం కరోనా రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్​మెంట్, వ్యాక్సినేషన్​ను కొనసాగించడం ముఖ్యం” అని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ ట్రాన్స్​మిషన్ చైన్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్ చేసేందుకు వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్నారు. శనివారం అన్ని రాష్ట్రాలు, యూటీలకు లెటర్ రాశారు. వీలైనంత ఎక్కువ మంది కి వ్యాక్సిన్ వేసేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘సెకండ్ వేవ్ టైమ్​లో చాలా రాష్ట్రాలు, యూటీల్లో కేసులు భారీగా పెరిగాయి. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు ఆంక్షలు  విధించాయి. ఇప్పుడు కేసులు తగ్గడంతో సడలింపులు ఇస్తున్నారు. ఆంక్షలు విధించడమైనా.. సడలింపులు ఇవ్వడమైనా.. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కరోనా కేసులు తగ్గిన తర్వాత ఎకనమిక్ యాక్టివిటీలు ప్రారంభించడం ముఖ్యమే. కానీ ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేపట్టాలి” అని సూచించారు.

టెస్టులు తగ్గించొద్దు..
కరోనా రూల్స్ పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్రాలు, యూటీలను అజయ్ భల్లా కోరారు. టెస్టింగ్ తగ్గించొద్దన్నారు. ప్రజలు మాస్కులు పెట్టుకోవాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్పారు. కేసులు తగ్గుతున్నాయనో.. ఆంక్షలు సడలించారనో నిర్లక్ష్యంగా ఉండొద్దని, కరోనా రూల్స్ తప్పక పాటించాలని సూచించారు. యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్నాయా అనే దాన్ని రాష్ట్రాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు. ‘‘చిన్న ప్రాంతాల్లో కేసులు పెరిగితే వెంటనే స్పందించేలా మైక్రోలెవెల్​లో ఓ సిస్టమ్​ను ఏర్పాటు చేయాలి. లోకల్ కంటెయిన్​మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలి” అని సూచించారు. ఎకనమిక్ యాక్టివిటీలు ఓపెన్ చేస్తున్న సమయంలో పరిస్థితిని జాగ్రత్తగా గమనించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. 

96 శాతానికి రికవరీ రేటు
దేశవ్యాప్తంగా 60,753 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,647 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కి, డెత్స్ సంఖ్య 3,85,137కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,60,019కి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో ఇది 2.55 శాతమే. ఇక రికవరీ రేటు 96.16 శాతానికి పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 2.98 శాతానికి తగ్గింది. గత 12 రోజులుగా 5 శాతం లోపే నమోదవుతోంది. వీక్లీ పాజిటివిటీ రేటు 3.58గా ఉంది. 37 రోజులుగా కొత్త కేసుల కంటే.. రికవర్ అవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటిదాకా 2,86,78,390 మంది కోలుకున్నారు. మొత్తంగా 27,23,88,783 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. శుక్రవారం 19 లక్షల టెస్టులు చేశారు.