- అన్ని పార్టీల మద్దతు.. మూజువాణి ఓటుతో బిల్లు పాస్
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ (సవరణ) బిల్లు –2023 లోక్ సభలో పాసైంది. గురువారం మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. రెండు రోజుల పాటు ఈ బిల్లుపై జరిగిన చర్చలో వివిధ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ.. 40 మంది ఎంపీలు బిల్లుకు పలు సవరణలు సూచించారు. బిల్లుపై చర్చల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. గిరిజన డ్రాపౌట్స్, వివక్ష వంటి అంశాలను లేవనెత్తిన ఎంపీలకు కౌంటర్ ఇచ్చారు.
“ఈ బిల్లును ఆమోదించడానికి మాకు తొమ్మిదేండ్లు పట్టింది. మీరు చాలా కాలం అధికారంలో ఉండి గిరిజనులకు చేసిందేమీ లేదు. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం లేదు” అని అన్నారు. వర్సిటీ నిర్మాణం కోసం భూములు సేకరించడంలో కేసీఆర్ సర్కార్ జాప్యం చేసిందని సభకు వివరించారు. అందువల్లే వర్సిటీ నిర్మాణం ఆలస్యం అయిందన్నారు. అయితే, ఈ యూనివర్శిటీ ఏర్పాటు రాబోయే కాలంలో ప్రాంతీయ ఆకాంక్షలను తీర్చగలదని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.