అమీన్​పూర్ ​మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : లోకాయుక్త డైరెక్టర్ వెంకట్​రావు

 అమీన్​పూర్ ​మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : లోకాయుక్త డైరెక్టర్ వెంకట్​రావు

రామచంద్రాపురం (అమీన్​పూర్), వెలుగు: అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములను లోకాయుక్త డైరెక్టర్ వెంకట్​రావు బుధవారం పరిశీలించారు. సర్వే నంబర్​ 1000 లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్న హెచ్​ఆర్​సీపీసీ ట్రస్ట్​ ఫిర్యాదు నేపథ్యంలో లోకాయుక్త అధికారులు అమీన్​పూర్​లో పర్యటించారు. రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 1000 లోని భూములు, వాటి వివరాలను అందజేశారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ముందుగానే నోటీసులు జారీ చేసినా మున్సిపల్​ అధికారులు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీవోఐ వెంకట్​ రావు మాట్లాడుతూ ప్రభత్వ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణ స్థాయిని అంచనా వేసి అన్ని వివరాలను రాబడతామని, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణల విషయంలో అధికారుల పాత్రపై ప్రత్యేక విచారణ చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ ఎండీ ఇస్మాయిల్, తహసీల్దార్ వెంకటేశ్, అడ్వకేట్​ఇంద్రజా ఠాకూర్, ఆర్ఐ రఘునాథ్​రెడ్డి పాల్గొన్నారు.