ఒక వర్గం కోసం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు

ఒక వర్గం కోసం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు

జగిత్యాల: కరోనా వల్ల ఎంతో నష్టపోయి.. కష్టాలుపడుతున్న రైతులు.. వ్యాపారులు.. వీధిన పడ్డ సామాన్యులు.. నిరుద్యోగులు..  ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఒక వర్గం మెప్పు కోసం  సీఎం కేసీఆర్.. ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర్ల అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పేదల కష్టాలను పక్కన పెట్టి..  అధిక సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టంలో మార్పు తేవాలని చూస్తున్నారని ఆయన  విమర్శించారు. కరోనా బారిన పడి  20 రోజుల పాటు  ఢిల్లీలో క్వారంటైన్ లో ఉండి కోలుకున్న అనంతరం నేరుగా కొండగట్టుకు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.  .

ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.  కరోనా వల్ల దాదాపు 20 రోజుల పాటు ఢిల్లీలో హోం క్వారంటైన్ లో ఉండి నేరుగా కొండగట్టుకు వచ్చాను…నేను నమ్ముకున్న దేవుళ్లు, కార్యకర్తల పూజల వల్ల ఇవాళ ఆ మహమ్మారి నుంచి బయటకు పడ్డాను..  ఎంపీగా గెలిచిన తర్వాత పాదయాత్ర చేసి కొండగట్టుకు వచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడి మళ్లీ స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ లాంటి వాళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ముగ్గురు కంటే ఎక్కువ సంతానం ఉన్నవాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారట… కేవలం ఓ వర్గానికి, దేశ ద్రోహ ఎంఐఎంకు కొమ్ముకాసే విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ వర్గం మెప్పు పొంది ఓట్లు పొందేందుకు చేస్తున్న కుట్ర ఇది. ఆనాడు కాంగ్రెస్ కూడా ముస్లింలను బీసీలుగా గుర్తించి ఓట్లు కొల్లగొట్టాలని చూసారు. దీంతో.. నిజమైన బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. అధిక సంతానం వల్ల ముస్లిం సమాజం కూడా ఇబ్బంది పడుతోంది. దాని వల్ల మహిళలు అనారోగ్యానికి గురవుతుంటే.. మళ్లీ అధిక సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టంలో మార్పు తేవాలని చూస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఎంఐఎంకు అప్పగించి పారిపోతాడని.. కేసీఆర్ కు దిమ్మతిరిగే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందువులంతా ఒక్కటి కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.  ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధి లేక వీధిన పడ్డవారి కోసం, నిరుద్యోగులు, రైతులు సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకునేందుకు కేంద్రం రిజర్వేషన్ తెచ్చింది…ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ ఫైల్ కేంద్రానికి పంపడం లేదు.. హైదరాబాద్ లో మూసినదిని కొబ్బరినీళ్లతో నింపుతానని చెప్పాడు. అలా చేసిన తర్వాత హైదరాబాద్ ప్రజలు నీకు ఓటేస్తారు.. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు గుర్తించారని బండి సంజయ్ పేర్కొన్నారు. సన్నవడ్లు పండించాలని సీఎం కేసీఆర్ చెబితే రైతులు అనేక ఇబ్బందులు పడి వాటిని పండించారు… కానీ వడగళ్ల వానపడి పంటలు దెబ్బతింటే వారిని పట్టించుకోవడం లేదని.. వారిని  ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన ఫాం హౌసులో మాత్రం దొడ్డు వడ్లు పండిస్తున్నాడు… దాదాపు 30 లక్షల ఎకరాల్లో పండించిన సన్నవడ్ల ధర సంగతేమిటి? అని ప్రశ్నించారు. దొడ్డువడ్లకు 1887, రెండో రకం వడ్లకు 1850 రూపాయల మద్ధతు ధర కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఈ వడ్లకు అదనంగా రాష్ట్రం 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. కొత్త వ్యవసాయ విధానాన్ని సీఎం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి.. తన ఫాం హౌసులో పండిన వరి పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్మకుండా ఇతర ప్రాంతాలకు ఎందుకు పంపిస్తున్నాడు…వాస్తవాలను గుర్తించే సోయి ఈ సీఎంకు లేదు.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కేంద్ర నిధులతో అభివృద్ధిచేసేందుకు సిద్ధం. కానీ రాష్ట్రం తమ ప్రతిపాదనలు ఇవ్వడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. సర్వే పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.