దేవుడితో పెళ్లి.. భగవంతుడిని దత్తత తీసుకోవడం... కుమారుడిగా ఆలింగనం చేసుకోవడం.. ఇలా రక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు బృందావనంలో ఓ మహిళ శ్రీకృష్ణ భగవానుడిని తన కుమారుడి మాదిరిగా ఆలింగనం చేసుకున్న వార్త వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళ్తే...
భారతీయ సంస్కృతిలో పెళ్లి.. ఆ తరువాత పిల్లలు ఇవన్నీ ఇష్టం ఉన్నా.. లేకున్నా సాధారణంగా జరిగిపోతుంటాయి. గతంలో ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ శ్రీకృష్ణ భగవానుడిని పెళ్లిచేకున్న ఘటన వైరల్ కాగా.. ఇప్పుడు కూడా అలాంటిదే మరో వార్త వైరల్ గా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు కాని మధ్యప్రదేశ్ కు చెందిన సంధ్య మిశ్రా అనే యువతి శ్రీకృష్ణుడిని కొడుకును చేసుకుంది.
మధ్యప్రదేశ్ కు చెందిన సంధ్యా మిశ్ర అనే మహిళ సాత్నాలో పెళ్లి చేసుకున్న తరువాత బృందావనానికి షిఫ్ట్ అయింది. ఇక్కడ కృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందేందుకు నిత్యం చాలా మంది భక్తులు వస్తుంటారు. వీరిలో కొందరు భక్తి అనే తన్మయత్వంలో మునిగిపోయి.. దేవునితో బంధాన్ని పెంచుకుంటారు. అలాగే సంధ్య లార్డ్ కృష్ణునితో బంధాన్ని పెంచుకొని తన బిడ్డకు ప్రతి రూపంగా చూసుకుంటుంది. కృష్ణుడి విగ్రహానికి లడ్డూ గోపాల్ అని పేరు కూడా పెట్టింది.
సంధ్యా మిశ్రా తన కొడుకుగా భావించే కృష్ణుని విగ్రహానికి ట్రెండ్ డ్రస్ లు వేసింది. యూత్ ధరించే స్టైలిష్ టీ షర్ట్ .. జీన్ ప్యాంట్ వేసింది. సమాజంలో ప్రత్యేకంగా కనపడేలా వేషధారణ ఉంది. అంతే అనుకుంటే పొరపాటే.. కాలేజీ స్టూడెంట్స్ పెట్టుకొనే స్మార్ట్ వాచ్ ను కూడా చేతికి అలంకరించింది.
శ్రీకృష్ణుడి భక్తురాలిగా ఆమె అనుబంధాన్ని పెంచకొని ఏడాదిన్నర క్రితం ( వార్త రాసే సమయానికి) తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించినట్లు తెలిపింది. తన ఇద్దరు పిల్లలపై చూపిన ప్రేమ, ఆప్యాయతనే లడ్డూ గోపాల్ పై కనపరుస్తుంది. రోజూ ఉదయాన్నే మెల్లగా నిద్రలేపి.. స్నానం చేయించి అలంకారం చేసి ఓ ముద్దు పెట్టి.. ఆలింగనం చేసుకుంటుంది. అల్పాహరం పెడుతున్నానని భావిస్తూ.. కృష్ణుడి విగ్రహం ఎదుట ఒక కప్పు టీ ... ఆ తరువాత ఒక గ్లాస్ పాలను ఉంచుతుంది. లంచ్ మరియు డిన్నర్ సమయాల్లో భోజనం కూడా సిద్ధం చేస్తుంది. తినేందుకు తయారు చేసిన ఏ పదార్దాన్నైనా మొదట రుచి చూసే వ్యక్తి లడ్డూ గోపాల్ ( కేశవ్) అని అంటుంది. కృష్ణుడికి వడ్డించిన తరువాతే కుటుంబంలోని మిగిలిన వారికి పెడతానని సంధ్య చెబుతున్నారు. ఇక రాత్రి పడుకొనే సమయంలో చిన్న పిల్లలకు జోలపాట పాడిన విధంగా పాటలు పాడుతూ.. మరల ఒకసారి ముద్దు పెట్టి.. ఆలింగనం చేసుకొని పడుకుంటానని సంధ్యా మిశ్రా తెలిపారు. మరి ఆమెది పిచ్చా.. అమితమైన భక్తా ఏమిటో అర్దం కావడంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేవుడిని కొడుకు మాదిరిగా భావించడం మరీ విడ్డూరంగా ఉంది కదూ...