తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో దసరా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ 8వ రోజున సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప దర్శనమిచ్చారు. స్వర్ణ రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనసేవ జరిగింది.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనసేవ జరుగనుంది. స్వరభూపాల వాహన సేవ కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీ చిన్నజీయర్స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతిరెడ్డి, డా. నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.