రేపు రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

రేపు రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ఫ్లాట్ల లాటరీని ఈ నెల 15న తీయనున్నామని హెచ్ఎండీఏ ఆదివారం వెల్లడించింది. లాటరీని యూట్యూబ్, ఫేస్ బుక్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తామని తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బండ్లగూడలో ,  మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పోచారంలో ఫ్లాట్ల లాటరీ తీస్తామని అధికారులు ఓ ప్రకటనలో  పేర్కొన్నారు.

మేడ్చల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా ఈ లాటరీ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. అయితే లాటరీ ఎక్కడ అన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. దీనిపై వారిని వివరణ కోరగా స్పందించడం లేదు. ఇక లాటరీ తరువాత మిగిలిన ఫ్లాట్లను ఓపెన్ ఆఫర్ లో ముందుకు వచ్చిన వారికి అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అయింది. బండ్లగూడ, పోచారంలో మొత్తం ఫ్లాట్ల ద్వారా రూ.800 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో మళ్లీ వేలంపాట నిర్వహించింది. రెండోసారి కూడా రెస్సాన్స్ రాకపోవడంతో మిగతా ఫ్లాట్లను ఓపెన్ ఆఫర్ లో పబ్లిక్ కు అమ్మేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.