పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
  • ప్రియురాలి మృతి.. ప్రియుడి పరిస్థితి విషమం

చిత్తూరు: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ యువ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఊరిబయట మామిడితోపుకు వెళ్లిన ఈ జంట తీవ్ర మనస్తాపంతో బతకడం వేస్టు అనుకుని వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. ప్రియురాలు మంజుభార్గవి (22) మృతి చెందగా.. ఆమె ప్రియుడు దివ్యకుమార్ (28) పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొత్తపేట సమీపంలోని మామిడితోపులో చోటుచేసుకుందీ ఘటన. తిరుపతి పట్టణం హరినాథపురం కు చెందిన వెంకటాద్రి కుమార్తె ఆర్. మంజుభార్గవి (22), చిన్నగొట్టిగల్లు మండలం చిట్టి చర్ల పంచాయతీ పరిధిలోని దాసరి గూడెంకు చెందిన సిద్దయ్య కుమారుడు దివ్య కుమార్ (28) గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలు మీరు పెళ్లికి అంగీకరించకపోవడంతో 2 సంవత్సరాల క్రితం దివ్య కుమార్ కు సిటిఎం సమీపంలోని పోత పాలెం కు చెందిన లావణ్య తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. ఇద్దరూ మర్చిపోయి ఉంటారనుకున్నంతలో కొంత కాలం నుంచి మంజు భార్గవి తన ప్రియుడు దివ్యి కుమార్  ను మర్చిపోలేకపోయింది. తనకు మెసేజ్ చేస్తుండడంతో దివ్య కుమార్ ప్రియురాలు మంజుభార్గవితో సంబంధాలు కొనసాగించాడు. ఇది బయటపడడంతో ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన దివ్యకుమార్ తన ప్రియురాలు మంజుభార్గవిని వెంట బెట్టుకుని కొత్తపేటలోని మామిడితోపుకు చేరుకున్నారు. ముందుగానే నిర్ణయించుకున్నట్లు వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగారు. అయితే కొద్దిసేపటికే విష ప్రభావంతో కడుపులో బాధ భరించలేక ఆర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కల వారు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా కు తరలించారు.