లవ్​ సక్సెస్​.. అయినా లవర్స్ సూసైడ్​

లవ్​ సక్సెస్​.. అయినా లవర్స్ సూసైడ్​

కంగ్టి, వెలుగు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు సైతం పెళ్లికి ఒప్పుకున్నారు. ఇంతలో ఏమైందో ప్రేమికుడు ఉరేసుకున్నాడు. అది తెలిసి ప్రేమికురాలు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ వివరాల ప్రకారం… చాప్త కె గ్రామానికి చెందిన కుర్మ రవీందర్(20), అదే గ్రామానికి చెందిన అనిత(18) కంగ్టి జూనియర్​ కాలేజీలో ఇంటర్​ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. అనిత తల్లిదండ్రులు వీరి ప్రేమ విషయం తెలుసుకుని కర్ణాటక బీదర్ జిల్లా బర్దాపూర్ గ్రామానికి  చెందిన వ్యక్తితో ఎంగేజ్​మెంట్​చేశారు. అనిత తాను ప్రేమించిన అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టడంతో చేసేదేం లేక ఒప్పుకున్నారు.

రవీందర్ తో అనిత వివాహం ఈ నెల 31న జరిపించడానికి పెద్దల సమక్షంలో నిశ్చయించారు. ఆదివారం పెళ్లి బట్టల షాపింగ్ వెళ్లే క్రమంలో ఇప్పుడే వస్తానని బైక్ పై వెళ్లిన రవీందర్ కంగ్టి శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. రవీందర్  ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో అనిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్​పోసుకొని నిప్పంటించుకుంది. పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ప్రేమజంట సూసైడ్ రెండు కుటుంబాలతో పాటు గ్రామస్థులను విషాదంలో ముంచేసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బాధిత
కుటుంబీకులను పరామర్శించారు.