భువనగిరిలో దారుణం : మొన్న ప్రేమ పెళ్లి.. నేడు ఆత్మహత్య

భువనగిరిలో దారుణం : మొన్న ప్రేమ పెళ్లి.. నేడు ఆత్మహత్య

భువనగిరిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

భువనగిరిలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 16న పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న స్వామి, ఉమ అనే ఈ జంట రెండు రోజుల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల స్వామి, శివరాత్రి ఉమారాణి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. వారిరివురు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి బీబీనగర్ మండలం కొండమడుగులోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత తమకు తమతమ కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని ప్రేమికులు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరు భువనగిరిలోని డాల్ఫిన్ హోటల్లో తలదాచుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఈ రోజు ఆ జంట హోటల్ రూంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. స్వామి అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉమను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉమ నుంచి జిల్లా మేజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఉమను పెళ్లి చేసుకుంటే చంపేస్తామని ఉమ కుటుంబ సభ్యులు స్వామిని బెదిరించారని.. అన్నట్లుగానే స్వామిని హతమార్చారని స్వామి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.