ఎక్కువ డోసు ట్యాబ్లెట్‌‌పై తక్కువ డోస్‌‌ లేబుల్‌

ఎక్కువ డోసు ట్యాబ్లెట్‌‌పై తక్కువ డోస్‌‌ లేబుల్‌

థైరోనార్మ్‌‌ ట్యాబ్లెట్స్‌‌ మార్కెట్లోకి రిలీజ్‌‌ చేసిన అబాట్‌‌ కంపెనీ
88 ఎంసీజీకి బదులు 25 ఎంసీజీ లేబుల్ 

హైదరాబాద్, వెలుగు: హైపో థైరాయిడిజం ట్రీట్‌‌మెంట్‌‌లో వినియోగించే థైరోనార్మ్ హై డోసు ట్యాబ్లెట్స్‌‌పై తక్కువ డోసు లేబుల్‌‌ ప్రింట్‌‌ చేసి అబాట్‌‌ ఇండియా లిమిటెడ్  కంపెనీ మార్కెట్‌‌లోకి విడుదల చేసింది. 88 మైక్రోగ్రామ్‌‌ల ట్యాబ్లెట్ షీట్లపై, 25 మైక్రోగ్రామ్‌‌ ట్యాబ్లెట్లుగా లేబుల్ ముద్రించి మెడికల్ షాప్‌‌లకు గత నెలలో సప్లయ్‌‌ చేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అనేక మెడికల్ షాపులకు ఈ ట్యాబ్లెట్స్‌‌ను సరఫరా చేసింది. తమ తప్పును గుర్తించిన కంపెనీ, ఇదే విషయాన్ని తెలుపుతూ ఇరు రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అథారిటీలకు సమాచారం అందించింది.

దీంతో ఆ కంపెనీ తయారు చేసిన థైరోనార్మ్‌‌ (థైరోగ్జిన్‌‌ సోడియం) ట్యాబ్లెట్స్‌‌ను మెడికల్ షాపుల నుంచి వెనక్కి తెప్పించాలని డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్లకు రాష్ట్ర డ్రగ్‌‌ కంట్రోల్ అథారిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. థైరోనార్మ్‌‌ బ్యాచ్ నంబర్ ఏఈజే0713 బ్యాచ్ మెడిసిన్‌‌లోనే ఈ పొరపాటు జరిగిందని, మిగిలిన బ్యాచ్ మెడిసిన్‌‌లో ఎలాంటి పొరపాటు లేదని కంపెనీ తెలిపింది.