
సీఎం మరో నిజాంలా మారిండు
రీడిజైనింగ్ పేరిట రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు
బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్
ఎల్ఆర్ఎస్ రద్దు కోసం సిద్దిపేటలో నిరసన
సిద్దిపేట, వెలుగు: ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట ప్రజలపై రూ. 3 లక్షల కోట్ల అప్పుల భారం మోపిన సీఎం కేసీఆర్, వాటికి వడ్డీలు కట్టేందుకే ఎల్ఆర్ఎస్ పేరిట జనాలను దోచుకోవాలని చూస్తున్నాడని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తిచేసి పంపిణీ చేయాలనే డిమాండ్తో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ను ముట్టడించారు. ఇందులో పాల్గొన్న వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. నిజాం సర్కారును తలపించేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారం చేపట్టాక ఆ విషయాన్నే మర్చిపోయారన్నారు. పోలీసులతో ప్రతి పక్షాల గొంతు నొక్కాలని సీఎం ప్రయత్నిస్తున్నాడన్నారు. అగ్రికల్చర్ బిల్లు విషయంలో అధికార పార్టీ ఆందోళనలను అడ్డుకోని పోలీసులు.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ లీడర్లను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్తో మూడు లక్షల కోట్లకు చేరిన అప్పుకు నెలకు మూడు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ఎల్ఆర్ఎస్ వంటి కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతున్నారని వివేక్ మండిపడ్డారు. 140 కోట్ల ప్రజానికానికి ప్రాతినిధ్యం వహించే కొత్త పార్లమెంట్ నిర్మాణానికి 800 కోట్లు అవసరమవుతుంటే.. కేవలం మూడున్నర కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సెక్రటేరియెట్ను వెయ్యి కోట్లతో కట్టాలనుకోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. సీఎం అవినీతి, అక్రమాలపై కేంద్రానికి వివరించినట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. వివేక్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్రెడ్డి, సురేశ్గౌడ్ తదితరులు ఉన్నారు.
For More News..