
- అందులో జమ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్కు హైకోర్టు ఆదేశం
- యథావిధిగా ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం
- పిటిషన్ ను తేల్చాలని సింగిల్ జడ్జికి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28, 29న లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి వచ్చే కానుకలను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయాలని దేవాదాయ శాఖ కమిషనరును హైకోర్టు ఆదేశించింది. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నిర్వహణలోని ప్రత్యేక ఖాతాలో వాటిని డిపాజిట్ చేయాలని సూచించింది.
ఆలయ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దాఖలైన వ్యాజ్యాన్ని శనివారం విచారించిన కోర్టు, తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. సంప్రదాయం ప్రకారం యథావిధిగా ఉత్సవాలను నిర్వహించుకోవచ్చని నిర్వాహకులకు స్పష్టం చేసింది.
గతేడాది పిటిషన్..
సింహవాహిని మహంకాళి ఆలయ ట్రస్ట్ పేరుతో కొంతమంది దేవాదాయ శాఖ అధికారులతో కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ గతేడాది గోవింద్ కుమార్ అనే వ్యక్తి దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశాడు. అసిస్టెంట్ కమిషనర్ విచారణ జరిపి ఆలయం నిర్వహణలో అక్రమాలతోపాటు నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఫిబ్రవరి 1న కమిషనర్ కు నివేదిక ఇచ్చారు.
దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గోవింద్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన సింగిల్ జడ్జి.. అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, నిధులను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు. సదరు ఉత్తర్వులను సవాల్చేస్తూ సింహవాహిని మహంకాళి ఆలయ ట్రస్ట్ కార్యదర్శి జి.అరవింద్ కుమార్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
ప్రతివాదిగా ఉన్న ట్రస్ట్వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని, సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయాలని పిటిషనర్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాది వాదనలు వినకుండా జారీ చేసిన సింగిల్ జడ్జి ఉత్తర్వులు చెల్లవంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. శని, ఆదివారాల్లో జరిగే ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. పిటిషన్ ను తేల్చాలని సింగిల్ జడ్జిని ఆదేశిస్తూ విచారణను ముగించింది.