మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఏప్రిల్ 09 ఆదివారం రోజున అయోధ్యను సందర్శించనున్నారు. సీఎం ఏక్ నాథ్ షిండే హనుమాన్గర్హి ఆలయం, రామ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. గతేడాది జూన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత షిండే అయోధ్య టెంపుల్ టౌన్కి వెళుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
అయితే ఇది రాజకీయ పర్యటన కాదని తాను అయోధ్యను సందర్శిస్తూనే ఉంటాను కానీ నేను ముఖ్యమంత్రిగా ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. తమ పార్టీ నాయకులందరూ రాముడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకున్నారని షిండే వెల్లడించారు. శివసేన నేతలు విల్లు, బాణం గుర్తు తెచ్చుకున్న తర్వాతే అయోధ్యకు వెళ్లాలని అనుకున్నామని ఆయన అన్నారు.
గతంలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించడానికి ఒక ఏడాది ముందు ఏక్ నాథ్ షిండే 2020లో అయోధ్యలో పర్యటించారు.