బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను పెంచారు. పంజాబ్కు చెందిన గ్యాంగ్ స్టర్ బిష్టోయ్ నుంచి సల్మాన్ ఖాన్కు బెదిరింపు కాల్స్ రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సల్మాన్ కు భద్రతను పెంచుతున్నట్లు ప్రకటించింది. సల్మాన్కు ఇంత వరకు వై కేటగిరీ భద్రత కొనసాగుతూ వస్తోంది. అయితే బిష్టోయ్ గ్యాంగ్ వల్ల సల్మాన్ కు ప్రమాదం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది.
వై ప్లస్ కేటగిరి భద్రత నేపథ్యంలో సల్మాన్ వెంట ఇద్దరు సాయుధ గార్డ్ లు ఉండనున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. ఇదే సమయంలో అక్షయ్ కుమార్ కు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్షయ్ కు ‘ఎక్స్’ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎక్స్ కేటగిరి భద్రత దృష్ట్యా అక్షయ్ కి ముగ్గురు అధికారులు మూడు షిఫ్ట్ ల కింద రక్షణగా ఉండనున్నారు.
సిద్ధూ మూసేవాలాను చంపినట్లు చంపుతామంటూ ఈ ఏడాది జూన్లో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం ఖాన్ లకు బెదిరింపు లేఖ అందడం కలకలం రేపింది. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా ఈ ఏడాది ప్రారంభంలో హత్యకు గురయ్యారు. సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించి.. బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధమున్న అనేక మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. వీరిలో చాలా మంది సల్మాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు.
2017లో సల్మాన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా బాంద్రా ఇంటి వెలుపల ఒకసారి, 2018లో పన్వెల్ ఫామ్హౌస్లో ఒకసారి గ్యాంగ్ స్టర్లు దాడికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్' అనే మూవీలో నటిస్తున్నారు. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రల్లో విక్టరీ వెంకటేష్, జగపతిబాబు, అతిథి పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇక అనుపమ్ ఖేర్ విషయానికి వస్తే.. 'ది కాశ్మీర్ ఫైల్స్' విడుదలైన తర్వాత బెదిరింపులు రావడంతో ఆయనకు అప్గ్రేడ్ సెక్యూరిటీ కల్పించారు.