- స్టడీ చేస్తున్న మహారాష్ట్ర జర్నలిస్టులు
- రాష్ట్రంలో 3 రోజులుగా పర్యటన
- పలు పార్టీల నేతలు, ప్రముఖులతో భేటీ
హైదరాబాద్, వెలుగు: ‘మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ పదే పదే చెప్తున్న ‘తెలంగాణ మోడల్’లో నిజమెంత? నిజంగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా? ’ అనే అంశాలపై మహారాష్ట్ర జర్నలిస్టులు స్టడీ చేస్తున్నారు. మూడు రోజులుగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆరుగురు సభ్యుల జర్నలిస్టుల టీమ్పర్యటిస్తున్నది. బీఆర్ఎస్చీఫ్, సీఎం కేసీఆర్ తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. గత కొన్ని నెలల్లోనే ఐదు సార్లు మహారాష్ట్రకు వెళ్లారు. ఇటీవల 600 కార్ల భారీ కాన్వాయ్తో సోలాపూర్కు వెళ్లివచ్చారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంట్, ఇంటింటికి నీళ్లు, కాళేశ్వరంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని.. రైతుబంధు, బీమా, దళితబంధు సహా అనేక స్కీమ్లతో దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నామని కేసీఆర్ చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేసీఆర్చెప్తున్న మాటల్లో నిజమెంతో తెలుసుకోవడంపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్చవాన్ సూచనతో ఆ రాష్ట్ర జర్నలిస్టుల బృందం తెలంగాణలో అడుగు పెట్టినట్టుగా సమాచారం. ఈ టీమ్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్త సెక్రటేరియెట్, అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి సహా అనేక ప్రాంతాలను సందర్శించింది. ఈ పర్యటనలో రైతులు, దళితులు, ఇతర వర్గాల ప్రజలను కలిసి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆరా తీసింది.
రేవంత్, కోదండరామ్, ప్రవీణ్కుమార్ తో భేటీ
మహారాష్ట్ర జరల్నిస్టుల బృందం తమ పర్యటనలో భాగంగా పలు పార్టీల ప్రెసిడెంట్లు, ప్రముఖులతో భేటీ అయింది. బుధవారం జూబ్లీహిల్స్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. అలాగే, టీజేఎస్ చీఫ్ప్రొఫెసర్ కోదండరామ్, బీఎస్పీ స్టేట్ చీఫ్ఆర్ఎస్ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్హరగోపాల్, రిటైర్డ్ఐఏఎస్ఆకునూరి మురళితో పాటు మరికొందరు ప్రముఖులను కలిసింది. కేసీఆర్ చెప్తున్న అభివృద్ధి మోడల్, తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఇతర అంశాలపై చర్చించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న కొందరు ప్రముఖులతోనూ సమావేశమైంది. రైతులు, దళితులు, ఇతర కులాల వారి అభిప్రాయాలనూ తీసుకుంది.
అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు? మిషన్ భగీరథ అమలు తీరు ఎలా ఉంది? తదితర వివరాలూ సేకరించింది. వీటితో పాటు వివిధ రంగాల ప్రముఖులు ప్రభుత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తమ ఫీల్డ్విజిట్లో వెల్లడైన వాస్తవాలతో జర్నలిస్టుల బృందం రిపోర్ట్తయారుచేసి అశోక్చవాన్కు అందజేసే అవకాశముందని తెలిసింది.