నిధులున్నా పనులు కావట్లే!.. అధికారుల ప్రణాళిక లోపం.. అభివృద్ధి పనులకు బ్రేక్

 నిధులున్నా పనులు కావట్లే!.. అధికారుల ప్రణాళిక లోపం.. అభివృద్ధి పనులకు బ్రేక్
  • కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​లో మూలుగుతున్న రూ. 7కోట్లు
  • సింగరేణి స్థలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
  • అబ్జెక్షన్​చేసిన సింగరేణి... ఆగిన పనులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆఫీసర్ల ప్రణాళిక లోపంతో అభివృద్ధి పనులకు బ్రేక్​ పడింది. కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​లో నిధులున్నా పనులు చేసుకోలేని దుస్థితి. మున్సిపల్​కార్పొరేషన్​ ఆఫీసర్లు నగరంలోని సింగరేణి స్థలాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పెట్టారు. ఆఫీసర్లు ఆ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. తమ స్థలాల్లో ఎలా పనులు చేపడుతారంటూ సింగరేణి సంస్థ అడ్డుకుంది.  దీంతో దాదాపు రూ. 7కోట్లు డీఎంఎఫ్​టీ ఫండ్స్​ ఏండ్లుగా మూలుగుతున్నాయి. 

ప్లాన్​ లేకపోవడమే.. 

కొత్తగూడెం నగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం డీఎంఎఫ్​టీ కింద రూ. 7 కోట్లు కేటాయించింది. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించి గత కౌన్సిల్​ సమావేశంలో కౌన్సిలర్ల నుంచి ప్రతిపాదనలు అడిగారు. ప్రజా ప్రతినిధులు తమ వార్డుల పరిధిలో ఎంపవర్​ మెంట్​ బిల్డింగ్స్, మహిళా సంఘాలకు సంబంధించిన ఆఫీస్​లతో పాటు పలు కమ్యూనిటీ హాల్స్​  నిర్మించాలని ప్రతిపాదనలు పెట్టారు. కౌన్సిల్​ తీర్మానం అయిందంటూ ఆఫీసర్లు ఆయా పనులకు సంబంధించి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్లు పిలిచారు.

 గత బీఆర్​ఎస్​ హయాంలో అప్పటి రవాణా శాఖ మంత్రి అజయ్​ కుమార్​ పలు అభివృద్ధి పనులకు కొత్తగూడెం నగరంలోని పోస్టాఫీస్​ సెంటర్, రామవరం ప్రాంతాల్లో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు.  ప్రతిపాదించిన పనులన్నీ సింగరేణి సంథలాల్లో ఉన్నాయి. 

పనులు చేపట్టే టైంలో యాజమాన్యం అడ్డుకుంది. తమ స్థలాల్లో తమకు కనీస సమాచారం లేకుండా ఎలా పనులు చేపడుతారంటూ అబ్జెక్షన్​ చెప్పింది. దీంతో పనులు ఆగిపోయాయి. పని చేపట్టే స్థలం ఎవరిది, ప్రైవేట్, గవర్నమెంట్, సింగరేణి, వివాదాల భూమినా అని సమాచారం లేకుండా కౌన్సిల్​ ఆమోదించి టెండర్లు పలిచింది. పనులు మొదలు పెట్టే టైంలో సింగరేణి ఆఫీసర్లు ఆబ్జెక్షన్​ చేయడంతో ఆఫీసర్లతో పాటు ప్రజా ప్రతినిధులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పలు పనులు దాదాపు రెండేండ్లుగా ముందుకు కదలడం లేదు. నిధులు ఉండి పనులు చేసేకోలేని దుస్థితి నెలకొంది.