శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు(1 మార్చి 2024) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 11 వరకు పదకొండు రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేశారు ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు. అర్చకులు, వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. 

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి.. శ్రీస్వామి అమ్మ వార్లను దర్శిస్తారని అంచనా వేశామన్నారు ఆలయ అర్చకులు. భక్తులకు 30 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని.. నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తుల స్వామి అమ్మ వార్లని దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివ స్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు.

ఈరోజు నుంచి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాయంత్రం 5 : 30 గంటలకు అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన పూజలు నిర్శహిస్తామని ఆలయ అధికారులు చెప్పారు. అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ.. ధ్వజారోహణ ద్వజపట ఆవిష్కరణ చేస్తామన్నారు. రేపటి(మార్చి 2) నుంచి ప్రతిరోజూ సాయంత్రం వివిధ వాహనసేవలతో శ్రీశైలం క్షేత్ర పురవీధులలో గ్రామోత్సవం జరుగుతుందని దేవస్థానం ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు.

Also Read : నాలుగు రూపాల్లో దర్శనం ఇచ్చే అయ్యప్పసామి.. మన తెలంగాణలో..