హైదరాబాద్, వెలుగు: నైని కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అదేపనిగా ఆరోపణలు చేయడం సరికాదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని కిషన్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో మీడియాతో మహేశ్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ రాసిన స్క్రిప్ట్ ను కిషన్ రెడ్డి చదువుతున్నారని, కేటీఆర్, హరీశ్ రావు దారిలోనే ఆయన వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
‘‘కిషన్ రెడ్డియే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కదా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం కాదు. దమ్ముంటే దీనిపై విచారణ జరిపించాలి. టెండర్లలో జరిగిన అవకతవకలపై చర్చకు రావాలి. బీఆర్ఎస్ హయాంలోనే ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయి. దీనిపై కిషన్ రెడ్డి విచారణ జరిపించాలి” అని మహేశ్ గౌడ్ అన్నారు.
