హైదరాబాద్, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు పేర్కొన్నారు. సోమవారం మహిళా కాంగ్రెస్ నేతలతో సునీతారావు నాంపల్లి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు జరుగుతున్న మేలుపై ఆరాతీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు 6 వేల కోట్లు మహిళల కోసం ఖర్చు పెడుతున్నదన్నారు. ఆటో కార్మికులు ఈ రోజు గుర్తుకొచ్చారా అని హరీశ్రావును నిలదీశారు. పదేండ్లలో రేషన్ కార్డులు, ఉద్యోగాలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తున్నారనే భయంతోనే బీఆర్ఎస్నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా రన్నారు.
