
- పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలి
- సెక్రటేరియెట్లో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంట ప్రతి ఇంటికి చేరాలని పంచాయతీ రాజ్ మంత్రి ధనసరి సీతక్క ఆకాంక్షించారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి వేల మంది ఉపాధి కల్పించాలని ఆమె అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ గ్రౌండ్ ఫ్లోర్, మూడో ఫ్లోర్ లో మహిళ సంఘాలతో నిర్వహించే మహిళ శక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతి కుమారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి ఆమె ప్రారంభించారు.
తర్వాత క్యాంటీన్ లో విక్రయిస్తున్న పిండివంటలను మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి కొనుగోలు చేశారు. క్వాలిటీతో, మంచి టేస్ట్ ఉన్నాయని ఇరువురు అభినందించారు. సెక్రటేరియెట్ లో విజిటర్లకు తెలిసేలా మంత్రుల పేషీల వద్ద మహిళా శక్తి క్యాంటీన్ల అడ్రస్ తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. సెక్రటేరియెట్లో తమకు క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మహిళా సంఘ సభ్యులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పథంలో నడవాలని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యాంటీన్లు, సోలార్ కరెంటు ఉత్పత్తి, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్ ఫొటోగ్రఫీ, మీ సేవ కేంద్రాల వంటి వ్యాపారాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతున్నామన్నారు.
గ్రామాల్లో జరిగే ఫంక్షన్లకు మహిళా సంఘాలు పిండివంటలు సరఫరా చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. 20 రోజుల్లో కలెక్టరేట్లు, రద్దీ ప్రాంతాలు, టూరిస్ట్ ప్లేస్ లలో క్యాంటీన్ల ఏర్పాటు పనులను చేయాలన్నారు. తెలంగాణ మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా ఎదుగుతాయన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంవో సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సెర్ఫ్ డైరెక్టర్లు గోపాలరావు, రజిని, నవీన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసిన రెండు క్యాంటీన్లలో తెలంగాణ పిండివంటలు సర్వపిండి, కార, లడ్డులు, అన్ని రకాల, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్లు, సకినాలు, అరిసెలు ఉన్నాయి.