సవాల్ను అవకాశంగా మార్చుకోవాలి..ట్రంప్ తారిఫ్ లపై ఆనంద్ మహీంద్రా

సవాల్ను అవకాశంగా మార్చుకోవాలి..ట్రంప్ తారిఫ్ లపై ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్​వార్ సవాలును అవకాశంగా మార్చుకోవాలని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇందుకోసం ఆయన రెండు కీలక సూచనలు చేశారు. మొదటిది, వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయాలి. 

పెట్టుబడి ప్రతిపాదనలకు సింగిల్-విండో క్లియరెన్స్ ఇవ్వాలి. దీంతో ప్రపంచ పెట్టుబడులకు భారతదేశం గమ్యస్థానంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

రెండోది, పర్యాటక శక్తిని విదేశీ మారక ద్రవ్యానికి, ఉద్యోగ కల్పనకు ఇంజన్​గా మార్చాలని సూచించారు. వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, పర్యాటకుల సదుపాయాలు మెరుగుపరచడం, భద్రత, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఉండేలా పర్యాటక కారిడార్లను అభివృద్ధి చేయాలని మహీంద్రా వివరించారు. 

ఎంఎస్​ఎంఈలకు మద్దతు పెంచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం, పీఎల్​ఐపథకాలను విస్తరించడం, పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించడం వంటి సంస్కరణలు అవసరమని మహీంద్రా స్పష్టం చేశారు.  

1991 ఆర్థిక సంక్షోభం సరళీకరణకు దారితీసినట్టే , టారిఫ్​వార్​తోనూ​ మనకు మంచి ఫలితాలు దక్కవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా, ఈయూ వంటి దేశాలు కూడా ఈ సవాళ్లను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని చెప్పారు.