
ముంబై: అమ్మకాలను పెంచుకోవడానికి మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఫైనాన్స్ స్కీమ్లను అందుబాటులోకి తెచ్చింది. డాక్టర్లకు, పోలీసులకు, మహిళలకు వెహికల్ ఆన్ రోడ్ ధరపై 100 శాతం ఫైనాన్స్ ఇస్తామని వెల్లడించింది. వీరికి 3 నెలల మారటోరియం కూడా వర్తిస్తుంది. లోన్ను ఎనిమిదేళ్ల లోపు చెల్లించాలి. ఈ కొత్త స్కీములతో జనం మరింత సులువుగా వెహికల్స్ను కొనుక్కోవచ్చని మహీంద్రా తెలిపింది. కరోనా బాధితులకు అద్భుత సేవలు అందించిన పోలీసులకు, డాక్టర్లకు మేలు చేయాలన్న ఆలోచన కూడా ఈ స్కీమ్లు తేవడానికి కారణమని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ విజయ్ నక్రా అన్నారు. ఈ మూడు రకాల కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజులో సగం డిస్కౌంట్ ఉంటుంది. వెహికల్ కొన్న 3 నెలల తరువాతే డబ్బు కట్టవచ్చు. ఫైనాన్సింగ్ కాస్ట్నూ పది బేసిస్ పాయింట్లు మేర తగ్గిస్తారు. బీఎస్–6 స్టాండర్డ్స్ కలిగిన పికప్ ట్రక్, ఎస్యూవీ కొన్న వాళ్లు వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ కట్టే అవకాశం ఇస్తోంది. లోన్ మొత్తంలో ప్రతి లక్షకు నెలకు రూ.1,234 చొప్పున ఈఎంఐ కడితే సరిపోతుందని నక్రా ఈ సందర్భంగా వివరించారు.