
ఉప్పల్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మల్లాపూర్లోని స్వాగత్ కన్వెన్షన్లో ఉప్పల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ చైర్మన్ బదురుద్దీన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్ల ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఉప్పల్ లో కారు గుర్తుకు ఓటేసి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు.
కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశాలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు, కుల సంఘాలతో సమావేశమయ్యారు. చిలుకానగర్ డివిజన్ ఆర్యవైశ్య సంఘం, మార్వాడి సంఘం, స్వరూప్ సాగర్ జువెలరీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రామంతాపూర్ డివిజన్ గణేష్ నగర్ కాలనీ, పీఎస్ కాలనీ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.