- మినాబ్ పాఠశాలపై దాడికి రివెంజ్
వాషింగ్టన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కేవలం క్షిపణులు, డ్రోన్లతోనే కాదు.. అత్యంత విధ్వంసకరమైన ‘సైబర్ దాడి’కి దిగింది. యూఎస్లోని ప్రముఖ మెడికల్ టెక్నాలజీ సంస్థపై విరుచుకుపడి.. భారీ స్థాయిలో డేటాను తుడిచిపెట్టేసింది. ఈ వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది.
అమెరికా మిచిగాన్లోని ‘స్ట్రైకర్’ అనే మెడికల్ టెక్నాలజీ సంస్థ సైబర్ దాడికి గురైంది. మార్చి 11న జరిగిన ఈ దాడిలో పదివేల కంప్యూటర్లు స్తంభించిపోయాయి, దీనివల్ల ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని సైబర్ గ్రూప్ ‘హందాలా హ్యాక్’ ప్రకటించింది.
ఫిబ్రవరి 28న మినాబ్లోని ఒక ప్రాథమిక పాఠశాలపై అమెరికా జరిపిన టోమాహాక్ క్షిపణి దాడిలో సుమారు 180 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగానే ఈ ‘డేటా వైపర్’ దాడి చేసినట్టు హందాలా గ్రూప్ స్పష్టం చేసింది.
భారీ డేటా చోరీ..
హందాలా హ్యాక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘స్ట్రైకర్’ మెడికల్ టెక్నాలజీ సంస్థకు చెందిన51 టెరాబైట్ల కీలక డేటాను దొంగిలించారు. 2 లక్షలకు పైగా సిస్టమ్లు, సర్వర్లు, మొబైల్ పరికరాల్లోని డేటాను పూర్తిగా తుడిచిపెట్టేశారు. కేవలం స్ట్రైకర్ మాత్రమే కాకుండా, పేమెంట్స్ సంస్థ ‘వెరిఫోన్’పై కూడా సైబర్ అటాక్ చేశారు. ఇరాన్ వైమానిక దాడులకు ఇది తమ నిర్ణయాత్మక సమాధానమని.. ప్రతీ దెబ్బకు అంతకు మించిన ప్రతిస్పందన ఉంటుందని హందాలా గ్రూప్ హెచ్చరించింది.
కాగా, హందాలా హ్యాక్ అనేది ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే శక్తిమంతమైన సైబర్ విభాగం. వీటిని వాయిడ్ మాంటికోర్, రెడ్ శాండ్స్టార్మ్, హోమ్ల్యాండ్ జస్టిస్ అని కూడా పిలుస్తారు. వీరు కేవలం వైరస్ల మీద ఆధారపడకుండా, మాన్యువల్గా సిస్టమ్లలోకి ప్రవేశించి డేటాను ధ్వంసం చేస్తారు. ఇజ్రాయెల్, అమెరికా ప్రభుత్వ సంస్థలు, వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసి, ప్రజల్లో భద్రతా సంస్థల పట్ల నమ్మకాన్ని తగ్గించడం వీరి లక్ష్యం.
ఈ బృందం పాలస్తీనా కార్టూన్ పాత్ర ‘హందాలా’ను తమ చిహ్నంగా వాడుకుంటున్నది. తాజా పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి.
