మాలలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

మాలలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
  • మంత్రి పదవితోపాటు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమివ్వాలి: చెన్నయ్య 

మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అండగా నిలిచిన మాలలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో మాలలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఏసీ గార్డ్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడారు. బీజేపీకి ఓట్లు వేసిన మాదిగలు ఇప్పుడు మంత్రి పదవి అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మంత్రి పదవితో పాటు నామినేటెడ్ పదవుల్లో మాలలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు.

షెడ్యూల్డు కులాల రెసిడెన్షియల్ కళాశాలలను మూసివేసే ఆలోచనలను ప్రభుత్వం మానుకోవాలని లేదంటే పోరాటం తప్పదని చెన్నయ్య హెచ్చరించారు. అలాగే చేవెళ్ళ డిక్లరేషన్ ను అమలు చేయాలని, అంబేద్కర్ అభయ హస్తాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా ప్రభుత్వం దళిత సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. భవిష్యత్ కార్యాచరణను రూపొంచేందుకు జూన్ 7న హైదరాబాద్ లో మాల మహానాడు రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.