
లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి. తాజాగా నటుడు-ఎమ్మెల్యే ముఖేష్, జయసూర్యల తదితరులపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే దర్శకుడు, నిర్మాత రంజిత్, నటులు సిద్ధిక్ మరియు ముఖేష్ తర్వాత మలయాళ సినీ పరిశ్రమ నుండి లైంగిక వేధింపుల కేసు నమోదు చేయబడిన నాల్గవ వ్యక్తిగా జయసూర్య నిలిచాడు.
ఈ నేపథ్యంలో నటుడు జయసూర్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మలయాళ నటి మిను మునీర్ (Minu Muneer) తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. పని చేస్తున్నప్పుడు ఎవరూ అసురక్షితంగా భావించకూడదు. ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ కూడా తనపై దాడి చేశారని ఆరోపించిన మునీర్.. తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ అతనికి మద్దతు ఇవ్వవద్దని ఆమె కోరారు. ముఖేష్ లాంటి వ్యక్తిని ఏ రాజకీయ పార్టీలు సమర్థించకూడదు అన్నారు.
అనంతరం ఆమె ‘అమ్మ’కు మోహన్లాల్ రాజీనామా చేయడంపైనా స్పందించారు. ఆ బాధ్యతలు చేపట్టే సామర్థ్యం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్కు ఉందని ఆమె తెలియజేశారు.
ALSO READ | Khushbu Sundar: జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్పై..స్పందించిన నటి ఖుష్బూ
‘‘ముఖేశ్, మణియన్పిళ్ల రాజు, ఇడవేల బాబు, జయసూర్య, ప్రొడక్షన్ కంట్రోలర్ నోబల్, విచు వల్ల నేను వేధింపులు ఎదుర్కొన్నాను. అసభ్య పదజాలంతో వారు నన్ను దూషించారు. 2013లో ఒక ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నప్పుడు నాకు ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితిమీరాయి. మలయాళం చిత్రపరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారు. ఈ సంఘటన వల్ల నేను మానసికంగా ఎంతో కుంగిపోయా’’ అని హేమ కమిటీ రిపోర్ట్ వైరల్గా మారిన తరుణంలో ఆమె చేసిన ఆరోపణలు అంతటా చర్చకు దారితీశాయి.
ఈ క్రమంలోనే నటుడు జయసూర్య, మణియన్ పిళ్ల రాజుపై తాజాగా కేసులు నమోదు అయ్యాయి. సెక్షన్ 354 కింద ఎర్నాకుళం పోలీసులు మణియన్ పిళ్ల రాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు తిరువనంతపురం కంటోన్మెంట్ పోలీసులు జయసూర్యపై కేసు నమోదు చేశారు.
మలయాళ సినీ కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న మోహన్లాల్ ఈ వారం ప్రారంభంలో తన 17 మంది సభ్యుల ఎగ్జిక్యూటివ్ కమిటీతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.