- నిరుద్యోగులే టార్గెట్గా సైబర్ నేరగాళ్ల వల
- లోన్ యాప్స్, కాల్ సెంటర్ల పేరుతో మోసం
- పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో కాల్ సెంటర్లు.. ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను ట్రాప్ చేస్తున్నారు. డబ్బు ఆశ చూపిస్తూ ఆన్లైన్ మోసాల అక్రమ దందాలోకి దింపుతున్నారు. నేరాలు ఎలా చేయాలి? కొట్టేసిన డబ్బును ఎలాంటి అకౌంట్లలో డిపాజిట్ చేయాలి? పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కేంద్రంగా ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. గృహిణులు, చిన్నచిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తూ ముద్ర, ధని వంటి ఆన్లైన్ లోన్ సర్వీసెస్ పేరిట మోసాలకు పాల్పడేలా సిద్ధం చేస్తున్నారు. ఇలా.. సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కిన వరంగల్, నిజామాబాద్కు చెందిన 10 మందిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి, ట్రైనింగ్ సెంటర్ల వివరాలు సేకరించారు.
నిరుద్యోగులే టార్గెట్గా యాడ్స్..
సైబర్ నేరగాళ్లు వివిధ వ్యాపార ప్రకటనలతో పాటు పార్ట్టైమ్ ఉద్యోగాలు అంటూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్నారు. ఎంపికైన వారికి మంచి జీతం, కమీషన్లు ఇస్తామని ఆశ చూపుతున్నారు. తర్వాత ఆన్లైన్ మోసాలకు అవసరమైన మ్యూల్ అకౌంట్లు, ఫోన్ నంబర్లు సేకరించడంపై ట్రైనింగ్ ఇస్తున్నారు.
కూలీలకు సైబర్ క్రైమ్ ట్రైనింగ్..
వరంగల్ జిల్లాకు చెందిన బి.అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ అనే వ్యక్తులు 2023లో జాబ్స్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ముద్ర లోన్, ధని లోన్ పేరిట వెబ్సైట్లు కనిపించాయి.అందులోని ఫోన్ నంబర్లకు కాల్ చేశారు. రాహుల్ అనే వ్యక్తి కాంటాక్ట్లోకి వచ్చాడు. లోన్స్ మంజూరు చేయడంతో పాటు రికవరీ చేయాలని, ఇందుకు జీతం,కమీషన్ ఇస్తామని నమ్మించాడు. నమ్మిన ఐదుగురు యువకులు 2023 జూన్లో వెస్ట్ బెంగాల్కు వెళ్లి కాల్ సెంటర్లో చేరారు. కృష్ణ అలియాస్ కిట్టు అనే మేనేజర్ వీరికి వసతి కల్పించాడు.రోజూ180 నుంచి 200 కాల్స్ చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడేలా ప్లాన్ చేయగా.. వచ్చిన మొత్తంలో వీరికి 30 శాతం కమీషన్ ఇచ్చేవారు.
లోన్ పేరుతో మహిళను నమ్మించి డబ్బులు వసూలు
హైదరాబాద్కు చెందిన ఓ మహిళతో ఓ వ్యక్తి కిలా పవన్ కుమార్గా పరిచయం చేసుకొని ఆమెకు రూ.3 లక్షల లోన్ మంజూరైందని చెప్పాడు. ఆమె నుంచే లక్షకు పైగా వసూలు చేశాడు. అనుమానం వచ్చిన మహిళా. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు వరంగల్ జిల్లాకు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యాం సహా నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఐదుగురిని ఇటీవల అరెస్ట్ చేశారు.
