ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన్రు

ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన్రు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన మల్కాజిగిరి పోలీసులు

మల్కాజిగిరి,వెలుగు: ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటేశ్వర నగర్ లో ఉండే గురు యోగేశ్వర్ మంగళవారం సాయంత్రం బైక్ పై పటేల్ నగర్ కి వెళ్లి రాత్రి 8.30 గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరాడు. నీరసంగా ఉండటంతో మార్గమధ్యలో బైక్ పక్కకు ఆపి కూర్చున్నాడు. అదే టైమ్ లో అటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు నీరసంతో  ఉన్న యోగేశ్వర్ ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామన్నారు. యోగేశ్వర్ బైక్ పై ముగ్గురు బయలుదేరారు.  ఇంటి సమీపానికి రాగానే యోగేశ్వర్ ను  తోసేసి ఆ ఇద్దరు బైక్​తో ఉడాయించారు.  యోగేశ్వర్ మల్కాజిగిరి పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన పటేల్ నగర్, దుర్గానగర్ కి చెందిన పస్తమొల్ల మహేశ్(29), బెల్లంకొండ ప్రతాప్(32)ను అదుపులోకి తీసుకున్నారు. యోగేశ్వర్ దగ్గర బైక్ రాబరీ   తామే చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని డీఐ మల్లారెడ్డి తెలిపారు. వారి దగ్గరి నుంచి బైక్ రికవరీ చేశామని  ఆయన చెప్పారు.