
మెదక్ టౌన్, వెలుగు: మహిళను నమ్మించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన పాత నేరస్తుడిని పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. కేసు వివరాలను ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు గురువారం మీడియాకు వివరించారు. హవేళీ ఘనపూర్ మండలం మద్దుల్వాయి గ్రామానికి చెందిన గజ్జల భిక్షపతి బుధవారం బస్సులో మెదక్ నుంచి నర్సాపూర్ వైపు వెళుతుండగా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.
మద్యం, చేపలు, డబ్బు ఇస్తానని ప్రలోభపెట్టాడు. ఆమె అతనితో కలిసి నర్సాపూర్లో దిగింది. ఇద్దరూ కలిసి మద్యం కొనుగోలు చేసి, ఆ తర్వాత ఆమెను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగిన తర్వాత మహిళపై దాడి చేసి, బంగారు రింగులు లాక్కొని పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సాపూర్ సీఐ జాన్రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నర్సాపూర్లో వైన్స్ షాపులో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితుడి ఆనవాళ్లు గుర్తించారు. నిందితుడు భిక్షపతిని గురువారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అరెస్టు చేసి, అతని నుంచి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
భిక్షపతి గతంలో పలు నేరాల్లో అరెస్టు అయినట్టు ఎస్పీ తెలిపారు. వ్యవసనాలకు బానిసైన భిక్షపతిపై వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో 10 కేసులు ఉన్నాయన్నారు. ఒక పోక్సో కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్టు తెలిపారు.11న తేదీన సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదల అయ్యాడు. బుధవారం పాత కేసుల విషయంలో అడ్వకేట్ను కలిసేందుకు మెదక్కు వెళ్లి, తిరుగు ప్రయాణంలో బస్సులో మహిళను పరిచయం చేసుకొని దాడిచేసి, ఆభరణాలు ఎత్తుకెళ్లాడు.