కారులో మంటలు..వ్యక్తి సజీవదహనం..కుటుంబ కలహాలతో సూసైడ్?

కారులో మంటలు..వ్యక్తి సజీవదహనం..కుటుంబ కలహాలతో సూసైడ్?

కుత్బుల్లాపూర్, వెలుగు: కారులో చెలరేగిన మంటల్లో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. కొన్ని కెమికల్స్​ కారులో లభించడంతో ఈ ఘటనను ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన కార్తీక్(40) జీవనోపాధి కోసం హైదరాబాద్​కు వచ్చి బౌరంపేట్​లోని ప్రణీత్​ ప్రణవ్​ విడోస్​లో నివాసముంటూ లాండ్రీ బిజినెస్​ చేస్తున్నాడు. 2013లో ఇతడికి ప్రేమ వివాహం జరగ్గా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. భార్య  రెండున్నరేళ్లుగా దూరంగా ఉంటోంది.  సోమవారం ఉదయం కార్తీక్​ తన కారులో  రుద్రా కన్​స్ట్రక్షన్​ సమీపంలోని ఖాళీ ప్రదేశంలోకి వెళ్లాడు. కొద్ది సేపటికే కారులోంచి మంటలు రావడాన్ని వాకర్స్​గమనించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి కార్తీక్​ పూర్తిగా మంటల్లో కాలిపోయాడు. మండే స్వభామున్న కెమికల్స్​ కారులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్తీక్​ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.