షాద్​నగర్ దాబాలో రూ.3.5 కోట్ల డ్రగ్స్​ పట్టివేత... ఇద్దరు అరెస్ట్​

షాద్​నగర్ దాబాలో రూ.3.5 కోట్ల  డ్రగ్స్​ పట్టివేత...  ఇద్దరు అరెస్ట్​
  • కిలోన్నర హెరాయిన్, 2.8 కిలోల పప్పీస్ట్రా, కిలో గంజాయి సీజ్​

హైదరాబాద్​సిటీ/షాద్​నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని ఓ దాబాలో భారీగా డ్రగ్స్​పట్టుబడ్డాయి. కిలోన్నర హెరాయిన్​తోపాటు గంజాయి, పప్పీస్ట్రాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్​కు చెందిన ఇద్దరిని అరెస్ట్​చేశారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్​సీపీ అవినాశ్​మహంతి మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని మౌలసర్ కు చెందిన వికాస్ సాహు(26), సిటీలోని ధూల్​పేటకు చెందిన సలీం, మహేశ్వరంకు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన గణపతి ఓ గ్యాంగ్​గా ఏర్పడి కొన్నాళ్లుగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు.

వికాస్ సాహు 2019 నుంచి షాద్ నగర్ టోల్ గేట్ సమీపంలోని సంజు భాయ్ మార్వాడీ దాబాలో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. యజమాని సంజు భాయ్ గంజాయి తాగే అలవాటు ఉంది. వీరిద్దరూ దూల్​పేటకు చెందిన సలీంతో కలిసి దాబాకు వచ్చే కస్టమర్లకు గంజాయి కూడా విక్రయించడం స్టార్ట్​చేశారు. తక్కువ ధరకు గంజాయి తెచ్చి దాబాలో ఎక్కువ ధరకు అమ్మేవారు. ఈ క్రమంలోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి గంజాయి, ఓపీఎం, హెరాయిన్, పప్పిస్ట్రా తీసుకొచ్చి దాబాలో విక్రయిస్తున్నారు. 10 గ్రాముల ఓపీఎంను రూ.1,300కు కొని.. రూ.2వేలకు; గ్రాము హెరాయిన్‌‌ను రూ.12వేలకు కొని,  రూ.15వేలకు విక్రయిస్తున్నారు. కాగా ఇటీవల దాబా యజమాని సంజు అనారోగ్యంతో మృతి చెందాడు. 

అప్పటి నుంచి వికాస్ సాహు దాబాను నడిపిస్తున్నాడు. దాబాను డ్రగ్స్ విక్రయానికి అడ్డాగా మార్చాడు. వారం కింద రాజు, గణపతి​నుంచి డ్రగ్స్​కొని దాబాలో అమ్మేందుకు సిద్ధం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 632 గ్రాముల ఓపీఎం, కేజీ గంజాయి, కిలోన్నర హెరాయిన్, 2.8 కిలోల పప్పి స్ట్రా, 89,700 నగదు, మూడు ఫోన్లు స్వాధీనం  చేసుకున్నారు. 

పట్టుకున్న డ్రగ్స్​విలువ బయట మార్కెట్​లో రూ.3.5 కోట్లు ఉంటుందని, వికాస్​సాహుకు డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. ప్రెస్​మీట్​లో శంషాబాద్ డీసీపీ రాజేశ్, మాదాపూర్ ఎస్‌‌ఓటీ డీసీపీ శోభన్‌‌కుమార్, ఏడీసీపీ  శ్రీనివాస్ రెడ్డి, ఇన్​స్పెక్టర్లు సంజయ్, విజయ్ పాల్గొన్నారు.