నాలాలో వ్యక్తి గల్లంతు.. ఆలస్యంగా వెలుగులోకి.. 

నాలాలో వ్యక్తి గల్లంతు.. ఆలస్యంగా వెలుగులోకి.. 
  • కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద ఈనెల 25న ఘటన 

మేడ్చల్: భారీ వర్షాలకు పొంగిపారుతున్న నాలాలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద ఈనెల 25న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నాలాలన్నీ గాలించినా ఎక్కడా మృతదేహం దొరకలేదు. దీంతో ఇవాళ బుధవారం కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు రెస్క్యూ బృందాలను పంపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
కుత్బుల్లాపూర్ గణేష్ టవర్స్ లో  నివాసముండే మోహన్ రెడ్డి ఈనెల 25న రాత్రి కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఇంటికి బయలుదేరే సమయంలో భారీ వర్షం రావడంతో స్నేహితులు ఇద్దరు రోడ్డు పక్కన ఆగారు. మోహన్ రెడ్డి నాలా పక్కకు వెళ్లి సిగరెట్ తాగుతూ ప్రమాదవశాత్తు అందులో పడిపోవడంతో గమనించిన స్నేహితులు పట్టుకునేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. నాలా ఉధృతిలో మోహన్ రెడ్డి కొట్టుకుపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు నాలాలన్నీ గాలించినా ఆచూకీ లభించలేదు. బుధవారం నాడు కుటుంబ సభ్యులు, బంధువు ప్రభావకర్ రెడ్డితో కాలసి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపుతామని అధికారులు హామీ ఇచ్చారని బంధువులు గల్లంతైన మోహన్ రెడ్డి బంధువులు తెలిపారు.