వాచ్ మెన్ ఉద్యోగం చేస్తూ... మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

 వాచ్ మెన్ ఉద్యోగం చేస్తూ... మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

ఒకటి, రెండు, మూడు....ఇవేమీ కార్పొరేట్ విద్యాసంస్థలు ఇచ్చే ర్యాంకింగ్ లు కాదు. అంతకన్నా విలువైనవి.  వాచ్ మెన్ ఉద్యోగం చేస్తూనే ఓ యువకుడు..   ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.  పట్టుదల, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC)లో  రాత్రిపూట వాచ్ మెన్ గా పనిచేస్తూ ...  పది రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. 

ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో... టీజీటి, పీజీటి, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు.  ప్రవీణ్.. ప్రాధమిక విద్య నుంచి డిగ్రీ వరకు జెన్నారంలో పూర్తి చేశాడు. ప్రవీణ్ తండ్రి పెద్దులు మేస్త్రీ పనిచేస్తుండగా... తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ప్రవీణ్ ను చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ప్రవీణ్ ఉన్నత ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ  ఓయూ క్యాంపస్ లో చదుపుకున్నాడు.

ALSO READ :- ఇంటింటికీ సోలార్ పవర్ కేంద్ర ప్రభుత్వ పథకం

ఖర్చుల కోసం ఈఎమ్మార్సీ లో ఐదేళ్లుగా వాచ్ మెన్ గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్దమయ్యాడు. అతని పట్టుదల, కష్టం ఫలించి... ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.  ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం పట్ల ఈఎమ్మార్సీ డైరెక్టర్, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రవీణ్ స్పూర్తితో పేదరికాన్ని జయించేందుకు విద్యార్థులు, యువత ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ను ఈఎమ్మార్సీ ఉద్యోగులు సన్మానించారు.