మంగుళూరు బ్లాస్ట్ పై దర్యాప్తు ముమ్మరం : కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్

మంగుళూరు బ్లాస్ట్ పై దర్యాప్తు ముమ్మరం : కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్

కర్నాటక : మంగుళూరు బ్లాస్ట్ పై సీరియస్ గా దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. తమిళనాడు, కేరళ డీజీపీలతో తాము టచ్ లో ఉన్నామని.. నిందితుడు మహ్మద్ షరీఖ్ వెనక ఎవరు ఉన్నారనే దానిపై కూపీ లాగుతున్నామని చెప్పారు. కొన్ని వర్గాల మధ్య గొడవలు సృష్టించడమే టెర్రరిస్టుల ప్రధాన లక్ష్యమని డీజీపీ వెల్లడించారు. ఈ కేసులో ఎన్ఐఏ సహా సెంట్రల్ ఏజెన్సీలు భాగస్వామ్యం అయ్యాయని చెప్పారు. నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇందులో వాస్తవాలు తేల్చేందుకు కొంత సమయం పడుతుందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ వెల్లడించారు.

బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక సూత్రధారితో సన్నిహితంగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. షరీఖ్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి..? ఇంకా ఎవరెవరితో పరిచయముంది అన్న అంశాలపై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించింది. దీని వెనుక ఉగ్రసంస్థలు ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించారు.