ఎర్రకోట దగ్గర కత్తులు తిప్పిన మనీందర్‌ సింగ్‌ అరెస్టు

ఎర్రకోట దగ్గర కత్తులు తిప్పిన మనీందర్‌ సింగ్‌ అరెస్టు

దేశ రాజధాని ఎర్రకోట దగ్గర రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీ హింసలో కత్తి తిప్పిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఎర్రకోట దగ్గర మనీందర్‌ సింగ్ అలియాస్ మోని (30) కత్తి తిప్పిన వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు అతడిని ‘మోస్ట్ వాంటెడ్’గా ప్రకటించారు. ఇన్నాళ్లూ తప్పించుకు తిరుగుతున్న అతడిని పిటంపురా బస్ స్టాప్  దగ్గర అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్వరూప్ నగర్ లోని అతడి ఇంట్లో నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

రైతులు ఆందోళన చేస్తున్న సింఘూ సరిహద్దులకు తాను రోజూ వెళ్లేవాడినని మనీందర్‌ సింగ్ చెప్పాడు. రైతు నేతల ప్రసంగాలతో తాను స్ఫూర్తి పొందానన్నాడు. ట్రాక్టర్ ర్యాలీ కోసం తన ఇంటికి పొరుగున ఉండే మరో ఐదుగురినీ కూడదీశానని, ఆ సమయంలో రెండు కత్తులను వెంట తెచ్చుకున్నానని తెలిపాడు. వారితో కలిసి సింఘూ సరిహద్దుల నుంచి ముకార్బా చౌక్ వరకు బైకులపై తమ టీమ్ అనుసరించిందని చెప్పాడు. పక్కా ప్లాన్ ప్రకారమే ఎర్రకోట దగ్గరకు చేరుకున్నట్టు వివరించాడు. అంతేగాకుండా… తన ఇంటి  దగ్గర పలువురికి కత్తిసాము నేర్పిస్తున్నాడని తెలిపారు పోలీసులు.