
కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి మరో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (19)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మణిపూర్లోని కాంగ్పోక్పిలో ఒక వర్గానికి మద్దతుగా పోరాడిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేయడమే గాక, వారిని ఊరంతా ఊరేగించే ఓ వీడియో ఇటీవలే బయటపడింది. ఇది యావత్ దేశాన్ని భారీ షాక్కు గురయ్యేలా చేసింది. ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్పోక్పి జిల్లాలో మే 4న ఈ సంఘటన జరిగింది.
ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నలుగురిని ఇప్పటికే రిమాండ్ కు పంపినట్టు పోలీసులు తెలిపారు. 26 సెకన్ల ఈ వీడియో జూలై 19న బయటికి రాగా.. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటలకే ఆ గ్రామంలోని కొందరు అతని ఇంటికి నిప్పు పెట్టారు. ఇదిలా ఉండగా వీడియోలో కనిపించిన మహిళల్లో ఒకరు భారత సైన్యంలో అస్సాం రెజిమెంట్కు సుబేదార్గా పనిచేసి, కార్గిల్ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికుడి భార్య కావడం గమనార్హం.