దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన సుప్రీం కేసును సుమోటోగా తీసుకుంది. ఈ ఘటన చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకుంటే తాము తీసుకుంటామని చెప్పింది.
సిగ్గుపడాల్సిన ఘటన: మోడీ
కాసేపటి క్రితమే మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ సీరియస్ అయ్యారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠినంగా శిక్షిస్తామన్నారు. మణిపూర్ ఘటన సిగ్గుపడాల్సిన విషయం.. ఇలాంటి దురాగతాలను సహించమని ప్రధాని అన్నారు. తక్షణమే ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియానుంచి తొలగించాలని ఆదేశించారు. మహిళలను గౌరవించే సంస్కృతి మనది.. ఇలాంటి ఘటనలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు మణిపూర్ ఘటనపై విపక్షాలు మండిపడ్డాయి.
మే4న మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటన జరిగింది. కాంగ్ పోక్సి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీడియోలు తొలగించండి
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వీడియోలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల నుంచి తొలగించాలని ఆదేశించింది. భారతదేశ చట్టాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. వైరల్ అయిన వీడియో పాతదని..దానిపై విచరాణ కొనసాగుతోందని తెలిపింది.