ఐపీఎల్-13: హైదరాబాద్ తడబ్యాటు

ఐపీఎల్-13: హైదరాబాద్ తడబ్యాటు

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. వన్‌డౌన్‌  బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.

సన్‌ రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఇన్నింగ్స్‌  మెరుపులు లేకుండానే సాగింది.  పాట్‌ కమిన్స్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌ స్టో బౌల్డ్‌ అయ్యాడు.  వార్నర్‌(36) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.  యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌ ..రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి  వెనుదిరిగాడు.

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌  ఫామ్‌లో లేకపోవడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది.  వార్నర్ వెనుదిరగడంతో స్కోరు వేగం మందగించింది.  మనీశ్‌ పాండే ఒక్కడే స్ఫూర్తిదాయక ప్రదర్శనతో   జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మరో ఎండ్‌లో వృద్ధిమాన్‌ సాహా నిదానంగా బ్యాటింగ్‌ చేశాడు. మధ్య ఓవర్లలో  కోల్‌కతా బౌలర్లు పరుగులను నియంత్రించారు. మిగతా ప్లేయర్లు అంతంత మాత్రమే ఆడటంతో భారీ స్కోర్ చేయలేక పోయింది హైదరాబాద్. కోల్ కతా బౌలర్లలో కమిన్స్, రస్సెల్, వరుణ్ తలో వికెట్ తీశారు.