
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ లో 300 ఎకరాల్లో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నిర్మించనున్నట్లు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో తన ఛాంబర్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగిత రానా, అధికారులతో కలిసి యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఉష రూపొందించిన ప్లాన్ ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఈ యూనివర్సిటీ మొట్టమొదటిదని తెలిపారు.
నాణ్యత ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో యూనివర్సిటీ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్కిటెక్ట్ ఉష రూపొందించిన ప్లాన్ గురించి కలెక్టర్ జితేశ్వీ పాటిల్తో ఫోన్లో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నిర్మాణం అయ్యేంతవరకు ప్రస్తుతం ఉన్న కాలేజీలో స్టూడెంట్స్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లాసులు జరిగేలా చూడాలని సూచించారు.