సికింద్రాబాద్, వెలుగు: కరోనా భయంతో చాలా మంది తిండి అలవాట్లను మార్చేసుకున్నారు. ఇమ్యూనిటీని పెంచే ఫుడ్డుపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోకుండానే సొంత నిర్ణయాలతో వాటిని వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని తార్నాకలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ఆన్లైన్ సర్వే చేసింది. గూగుల్ సెర్చ్లో సేకరించిన అంశాల ఆధారంగా ఫుడ్ సేఫ్టీ, వారు వాడుతున్న ఇమ్యూనిటీ బూస్టర్లు సహా 28 అంశాలపై 957 మంది నుంచి వివరాలను తీసుకుంది. వారిలో అత్యధికంగా 71 శాతం మంది విటమిన్ సీ సప్లిమెంట్లు తీసుకున్నట్టు తేలింది. మరో 68.2 శాతం మంది విటమిన్ సీ ఉన్న పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలను తిన్నట్టు చెప్పారు. జింక్ సప్లిమెంట్లను వాడినట్టు 61.4 శాతం మంది చెప్పారు. మన వంటల్లో వాడే అల్లం, అల్లంతో తయారు చేసే రసాలను వాడినట్టు 62.9 శాతం మంది, వెల్లుల్లితో తయారు చేసిన ఫుడ్ను తీసుకున్నట్టు 50.9 శాతం మంది చెప్పుకొచ్చారు.
మోడీ చెప్పారని..
హెర్బల్ ప్లాంట్స్, మిరియాల కషాయం గురించి చాలామంది గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకున్నప్పటికీ.. కొంచెం ఘాటుగా ఉండడం వల్ల మిరియాల కషాయాన్ని తీసుకోలేకపోయినట్టు సర్వేలో పాల్గొన్నవాళ్లు చెప్పారు. 28.8 శాతం మందే మిరియాల కషాయాన్ని వాడినట్టు సర్వేలో తేలింది. ప్రధాని నరేంద్ర మోడీ సూచించారని చవన్ప్రాశ్ వాడి నట్టు 57.5% మంది చెప్పడం విశేషం. హోమియో మందులను ఇమ్యూనిటీ బూస్టర్లుగా వాడినోళ్లు 28.1 శాతమని సర్వే పేర్కొంది. ఆన్లైన్ ఫుడ్ తినడాన్ని తగ్గించి ఇంటివంటకు ప్రాధాన్యం ఇచ్చామని 60% మంది చెప్పారు.