హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్ ఉద్యోగాల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న పలువురి అప్లికేషన్లలో తప్పులున్నాయి. ఆన్లైన్లో తప్పుడు వివరాలు కనిపిస్తున్నాయని మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఎక్కువ మంది దరఖాస్తులలో తప్పులున్నట్లు గుర్తించిన మెడికల్ బోర్డు.. టెక్నికల్ సమస్యల కారణంగా ఇలా జరిగినట్లు భావిస్తోంది. దీంతో సదరు డాక్టర్లందరికీ రీ ఎన్రోల్కు అవకాశం ఇచ్చింది.
ఈ నెల17 నుంచి 24 వరకు ఎడిట్ ఆప్షన్ ను కల్పించింది. www.mhsrb.telangana.gov.in లో ఎడిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి వివరాలను స్పష్టంగా ఎంట్రీ చేస్తూ, సర్టిఫికెట్లను కూడా స్కానింగ్ చేసి పొందుపర్చాలని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ నెల ఆగస్టు 14 సాయంత్రం 4 గంటల వరకు అప్లికేషన్ల దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటికే దాదాపు 3500 మంది డాక్టర్లు దరఖాస్తు చేశారు.