
జూన్ 10న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్రకమిటీ. ఛత్తీస్ ఘడ్ లో 27 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మే 21న చత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో 27 మంది మావోలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన తెలుగు రాష్ట్రాల మావోల మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా అప్పగించలేదు.
ALSO READ | ఆపరేషన్ సిందూర్లో.. రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్లు కుప్పకూలినయ్ : మంత్రి ఉత్తమ్
ఆపరేషన్ కగార్ ఆపేసి.. మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని గత కొన్నిరోజులుగా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. .. అయినా కేంద్రం తగ్గడం లేదు. శత్రుదేశం అయిన పాకిస్తాన్ తో చర్చలు జరిపి..దేశంలో ఉన్న మావోలతో చర్చలు జరపడం లేదని మావోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31లోపు పూర్తిగా అంతమొందించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ సంకల్పం తీసుకుందన్నారు. మావోయిజాన్ని నిర్మూలిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు.