- ఎన్కౌంటర్లకు సర్కారుదే బాధ్యత
- మావోయిస్టు ఏరియా సెక్రటరీ పాపన్న
నర్సంపేట, వెలుగు: ఎన్కౌంటర్లకు టీఆర్ఎస్గవర్నమెంట్ బాధ్యత వహించాలని, ఆ పార్టీ కేడర్ను వదిలిపెట్టబోమని సీపీఐ మావోయిస్టు ఇల్లెందు –- నర్సంపేట ఏరియా కమిటీ సెక్రటరీ పాపన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి ప్రజా ఉద్యమాలపై దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ సెక్రటరీ శాంత, ఇల్లెందు -నర్సంపేట ఏరియా దళ కమాండర్ బుచ్చన్న, కైలాశ్ పోలీసులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ అన్న కేసీఆర్ నిత్యం ఎన్కౌంటర్లతోనే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. వెంకటాపురం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఈ నెల 22న తలపెట్టిన బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.