రూ.45 లక్షల 99 వేలు పలికిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి లడ్డూ

రూ.45 లక్షల 99 వేలు పలికిన మరకత  శ్రీ లక్ష్మీ గణపతి లడ్డూ

హైదరాబాద్: ఎవరూ ఊహించని విధంగా అల్వాల్ లోని కనాజీగూడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి లడ్డూ రికార్డ్ స్థాయిలో వేలం పలికింది. రూ.45 లక్షల 99 వేల 999కి గణపతి లడ్డూ అమ్ముడు పోయింది. అల్వాల్ లోని కనాజీగూ మరకత శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో గణపతి భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ నవరాత్రులు భక్తులు గణపతికి అభిషేకాలు, పూజలు చేశారు. అయితే ఇవాళ జరిగిన  వేలం పాటలో 45 లక్షల 99 వేల 999 రూపాయలకు గణపతి లడ్డూను గీతాప్రియ, వెంకటరావు అనే దంపతులు కైవసం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా లడ్డూను సొంతం చేసుకున్న గీతాప్రియ, వెంకటరావు దంపతులు మాట్లాడుతూ... గణపతి ఆశీర్వాదం వల్ల లడ్డూ తమకే దక్కిందని, అందుకు తాము చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. గతేడాది కూడా తామే స్వామివారి లడ్డూను దక్కించుకున్నామని చెప్పారు. ఇకపోతే... బాలాపూరు  కంటే కూడా ఇక్కడి లడ్డూకు వేలంలో ఎక్కువ పలకడం విశేషం. ఈ సారి బాలాపూరు లడ్డూను రూ.24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.