193 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
12,000 పైన ముగిసిన నిఫ్టీ
తగ్గిన బంగారం ధర
నెగిటివ్లో క్రూడాయిల్
బలపడిన రూపాయి
గత సెషన్లో భారీగా పడ్డ ఇండియన్ బెంచ్మార్క్ ఇండెక్స్లు మంగళవారం సెషన్లో రీబౌండయ్యాయి. పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణ వాతావరణం నిలకడగా ఉండడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు పాజిటివ్గా ట్రేడయ్యాయి. వీటికి తోడు క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో, రూపాయి డాలర్ మారకంలో బలపడింది. సెషన్ ప్రారంభంలోనే ఇండియన్ మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఓపెన్ అయిన 45 నిముషాలలోనే బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ. 1.60 లక్షల కోట్లు పెరిగి 155.52 లక్షల కోట్లకు చేరుకొంది. సెన్సెక్స్ 500 పాయింట్లు లాభపడి 41, 168 స్థాయిని తాకింది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 12, 152 స్థాయికి చేరుకొంది. చివరికి సెన్సెక్స్ 192. 84 పాయింట్లు లాభపడి 40,869.47 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59.90 పాయింట్లు లాభపడి 12,052.95 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్లో అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా షేర్లు అధికంగా నష్టపోయాయి.
గ్లోబల్ మార్కెట్లు పుంజుకున్నాయి..
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడయ్యాయి. జపాన్ నికాయ్ 1.6 శాతం లాభపడింది. హాంగ్కాంగ్ 0.3 శాతం, షాంఘై 0.7 శాతం లాభపడ్డాయి. ఆస్ట్రేలియా ఒక శాతం, దక్షిణ కొరియా ఒక శాతం, సింగపూర్ 0.7 శాతం పెరిగాయి. లండన్ 0.1 శాతం, పారిస్ 0.4 శాతం లాభపడ్డాయి.
పడిన బంగారం..
డాలర్ మారకంలో రూపాయి బలపడడంతో పాటు, ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో మంగళవారం సెషన్లో బంగారం ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రా. బంగారం రూ. 420 తగ్గి రూ. 41,210 కి పడింది. గత సెషన్లో బంగారం ధర(10 గ్రా.) రూ. 41,630 వద్ద ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. రూపాయి బలపడడంతో పాటు, అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకోవడంతో ఇండియన్ మార్కెట్లో బంగారం ధర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెచ్ దేవర్ష్ వకీల్ అన్నారు. జనవరి 15 తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుండడంతో డిమాండ్ పుంజుకుంటుందని అన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం 1,568 డాలర్లుగా ఉంది.
బలపడిన రూపాయి..
గత కొన్ని సెషన్లలో డాలర్ మారకంలో బలహీనపడిన రూపాయి, మంగళవారం సెషన్లో పుంజుకొంది. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్గా ఉండడంతో పాటు, డాలర్ మారకంలో ప్రధాన కరెన్సీలు బలపడ్డాయి. దీనికి తోడు క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో, డాలర్ మారకంలో రూపాయి మంగళవారం సెషన్లో 22 పైసలు లాభపడి 71.71 వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో 71.93 వద్ద ముగిసిన రూపాయి, చివరికి 10 పైసలు లాభపడి మంగళవారం 71.83 వద్ద ముగిసింది.
పడిన క్రూడాయిల్..
గత రెండు సెషన్లలో భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు మంగళవారం సెషన్లో తగ్గుముఖం పట్టాయి. బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.66 శాతం నష్టపోయి బ్యారెల్ 68.46 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డబ్యూటీఐ క్రూడ్ 0.57 శాతం పడిపోయి బ్యారెల్ 62.91 వద్ద ట్రేడవుతోంది. ఇండియన్ ఎంసీఎక్స్ మార్కెట్లో క్రూడాయిల్ రూ. 35 తగ్గి బ్యారెల్ రూ. 4,503 కు చేరుకుంది. ఇరాన్ తీసుకునే చర్యలను గురించి మార్కెట్లు ఎదురుచూస్తున్నాయని ఎనలిస్టులన్నారు. మంగళవారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.51 గా, లీటర్ డీజిల్ ధర రూ. 74.98 గా ఉంది.