- ఆన్లైన్ బిజినెస్ రూ.200 కోట్లకు టోకరా,
- 20 లక్షల మంది బాధితులు
విజయవాడ: ఏపీలోని విజయవాడలో భారీ సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. లవ్ లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ కేర్ అనే ఆన్లైన్ సంస్థ ద్వారా బాధితులకు వల వేసి నిండా ముంచారు. రూ.200 కోట్లకు కేటుగాళ్లు టోకరా వేశారు. బాధితులు దాదాపు 20 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వైద్య పరికరాలను ఆన్లైన్లో పెట్టి వాటికి రీచార్జ్లు చేయించుకుని అందరినీ మోసం చేశారు. ఏపీ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లవ్ లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ కేర్ సంస్థ రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు హెల్త్ పరికరాలను ఆన్లైన్లో పెట్టింది. ఒక్కో పరికరానికి రీచార్జి పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసింది. రీఛార్జీ చేసుకున్న వారికి రూ.100 నుంచి రూ.2 వేల విలువ చేసే గిఫ్ట్లు అందజేసింది. రీచార్జ్ చేసినప్పుడల్లా చాలా గిఫ్టులు వస్తుండటంతో విషయం ఆనోటా, ఈనోటా పాకి.. చాలామందికి తెలియడంతో మెడికల్ ఎక్విప్మెంట్పై రీచార్జ్ చేసేందుకు జనాలు ఎగబడ్డారు. వేలకు వేలు రీచార్జిలు చేసేవారు. దీంతో వచ్చిన కోట్లాది రూపాయల డబ్బుతో ఉడాయించి సడెన్గా బోర్డు తిప్పేశారు కేటుగాళ్లు. దీంతో బాధితులంతా విజయవాడ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు దాదాపు 20 లక్షల మంది ఉంటారని.. బాధితుల్లో లాయర్లు, పోలీసులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు జనాలను ఎంతగా హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
