చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నంబాల కేశవరావు సహా 27 మంది మృతి

చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నంబాల కేశవరావు సహా 27 మంది మృతి
  • అబూజ్​మడ్​ అడవుల్లో 72 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్
  • మావోయిస్ట్​ పొలిట్​ బ్యూరోమీటింగ్​పై బలగాల మెరుపుదాడి
  • కేశవరావు సహా 27 మంది నక్సల్స్ చనిపోయినట్లు అమిత్​ షా ట్వీట్​
  • వచ్చే ఏడాది మార్చి 31 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటన
  • ఎన్​కౌంటర్​లో  ఓ జవాన్​ కూడా మృతి
  • మావోయిస్ట్​ చీఫ్​ కమాండర్​గాఉన్న నంబాల కేశవరావు
  • 2018లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
  • శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేటలో జననం..వరంగల్​ ఆర్​ఈసీలో బీటెక్​ పూర్తి
  • ఎంటెక్​ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు పయనం
  • చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక పాత్ర
  • గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నేర్పరి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో మరో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. మావోయిస్ట్​ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్​ బసవరాజు సహా 27 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కగార్’​తో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చత్తీస్​గఢ్​లోని నారాయణపూర్​ జిల్లా అబూజ్​మడ్​ అడవుల్లో కొన్నిరోజులుగా బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో నంబాల కేశవరావు సహా మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. 2003లో చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడితో పాటు అనేక ఘటనల్లో కేశవరావు వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన వయసు 70 ఏండ్లు. కోటిన్నర రూపాయల రివార్డు కూడా ఉంది. ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాన్​ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.  

మెరుపుదాడి

ఆపరేషన్ కగార్​తోపాటు కర్రెగుట్టలపై భద్రతా బలగా ల కూంబింగ్​తదితర పరిణామాలపై మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం చత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్​, -నారాయణ్​పూర్​ జిల్లాల బార్డర్​లోని ఇంద్రావతి దండకారణ్యంలో జరుగుతున్నట్లుగా ఇంటిలి జెన్స్ వర్గాల ద్వారా కేంద్ర బలగాలు పసిగట్టాయి. దీంతో బస్తర్​ ఐజీ సుందర్ ​రాజ్. పి అలర్ట్ అయ్యారు.

బీజాపూర్​, దంతెవాడ జిల్లాల నుంచి డీఆర్జీ బలగాలను నారాయణ్​పూర్​ జిల్లా డీఆర్జీ బలగాలకు తోడుగా కూంబింగ్​ కోసం పంపించారు. మూడురోజులుగా బలగాలు ఇంద్రావతి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇదే సమయంలో నారాయణ్​పూర్​ జిల్లా ఓర్చా పోలీస్​స్టేషన్​ పరిధిలోని జాట్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పొలిట్​బ్యూరో సమావేశాన్ని గుర్తిం చిన భద్రతా బలగాలు ఒక్కసారిగా మెరుపుదాడికి దిగా యి. బుధవారం ఉదయం భారీగా కాల్పుల మోతలు వినిపించాయి. ఎన్​కౌంటర్​లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు.

అక్కడ మావోయిస్టు పార్టీ చీఫ్​ కమాండర్,  కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్​ బసవరాజు అలియాస్​ గంగన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో అదనపు బలగాలను ఓర్చా పోలీస్​స్టేషన్​ ప్రాంతానికి తరలించారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలు తరలించే సమయంలో మావోయిస్టులు దాడికి దిగొచ్చన్న అనుమానంతో బ్యాకప్​ టీంలు రౌండప్​ చేసి అడవిలో కూంబింగ్​ చేపట్టాయి. కాగా, బలగాలు సాహసోపేతంగా పోరాటం చేశాయని చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​ సాయి అన్నారు. 72 గంటల పాటు బలగాలు కూంబింగ్​ చేశాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్​శర్మ తెలిపారు. 

మార్చి 31 వరకు నక్సలిజం అంతం: అమిత్​ షా

దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31లోపు పూర్తిగా అంతమొందించేందుకు  కేంద్రంలోని మోదీ సర్కార్​ సంకల్పం తీసుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటించారు. చత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​లో నంబాల కేశవరావు మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆయన ట్వీట్​ చేశారు. నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని పేర్కొన్నారు. ఆపరేషన్​ బ్లాక్ ఫారెస్ట్ ​ముగిసేనాటికి చత్తీస్​గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని, 84 మంది లొంగిపోయారని అమిత్​ షా తెలిపారు.


ప్రజలకు శాంతిని అందిస్తం: ప్రధాని మోదీ

మావోయిజాన్ని నిర్మూలిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్​ చేశారు. చత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​ను ధృవీకరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేసిన ట్వీట్​పై ఆయన స్పందించారు. ‘‘బలగాల అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్న. ప్రజలకు శాంతిని, అభివృద్ధిని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పోస్ట్​ చేశారు. 

ఇది కీలక విజయం: అమిత్​ షా

నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ట్వీట్​ చేశారు. ‘‘చత్తీస్​గఢ్​లోని నారాయణ​పూర్​లో సెక్యూరిటీ ఫోర్స్​ చేపట్టిన ఆపరేషన్​లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో సీపీఐ–మావోయిస్టు పార్టీ జనరల్​ సెక్రటరీ,  టాప్​ మోస్ట్​ లీడర్​ నంబాల కేశవరావు అలియాస్​ బసవరాజు ఉన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియలో ఇది ఓ మైలురాయి విజయం. నక్సలిజంపై మూడు దశాబ్దాలుగా భారత్​ చేపడ్తున్న పోరాటంలో ఒక జనరల్​ సెక్రటరీ స్థాయి లీడర్​ చనిపోవడం ఇదే మొదటిసారి” అని ఆయన పేర్కొన్నారు. 


సజ్జా వెంకట నాగేశ్వరరావు కూడా..?

చత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​ మృతుల్లో సజ్జా వెంకట నాగేశ్వరరావు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈయన మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్​ జోనల్​ కమిటీ ప్రెస్​ యూనిట్​ ఇన్​చార్జ్​గా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ పత్రికలో ఎడిటోరియల్​ ఇన్​చార్జ్​గా పనిచేస్తున్నారు. రాజన్న అలియాస్​ ఏసన్న అలియాస్​ నవీన్​ పేర్లతో ఆయనను పిలుస్తుంటారు. నాగేశ్వరరావు స్వగ్రామం ఏపీలోని  చీరాల మండలం జాండ్రపేట. 

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో రెడ్​ అలర్ట్

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్​ బసవరాజు మృతి చెందడంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ రెడ్​ అలర్ట్ ప్రకటించింది. ప్రతీకారేచ్ఛతో మావోయిస్టులు దాడులకు పాల్పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. మావోయిస్టుల కదలికపై దృష్టిసారించాలని ఆయా రాష్ట్రాల పోలీసులకు సూచించింది.