జకర్తా: ఇండోనేసియా రాజధాని జకార్తాలోని కేమయోరన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పీటీ టెర్రా డ్రోన్ అనే డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఏడంతస్తుల బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ గర్భిణి సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
లంచ్ టైం కావడంతో చాలామంది ఉద్యోగులు బయట ఉండగా.. మొదటి అంతస్తులోని డ్రోన్ బ్యాటరీల స్టోరేజ్- టెస్టింగ్ ఏరియాలో ఉన్న ఓ బ్యాటరీలో స్పార్కింగ్ జరిగి పేలుడు సంభవించిందన్నారు. దాంతో మంటలు వేగంగా పైఅంతస్తులకు వ్యాపించాయని చెప్పారు. 29 ఫైర్ ఇంజన్లు, వందలాది మంది సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారని వివరించారు. 6వ అంతస్తులో చిక్కుకుపోయిన పదకొండు మంది మహిళా ఉద్యోగులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారని తెలిపారు.

