హైదరాబాద్, వెలుగు: సిటీలో ఆదివారం పొద్దంతా మేఘాలు కమ్ముకుని.. సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. గంటకు పైగా పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్జామ్ లు అవడంతో పాటు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేసింది. అధికంగా మలక్ పేట్లో 7.1, చార్మినార్ లో 6.9, నాంపల్లిలో 6.9 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
అదేవిధంగా ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, బండ్లగూడ జాగీర్, ఖైరతాబాద్, అసెంబ్లీ ఏరియా, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, షేక్పేట్, బషీర్బాగ్, అబిడ్స్, కోఠి, నారాయణ గూడ, హిమాయత్నగర్, ఫీవర్హాస్పిటల్, నల్లకుంట, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, సికింద్రాబాద్, పద్మారావు నగర్, బోయిగూడ, శేరిలింగంపల్లి, గుడి మల్కాపూర్, ఉప్పుగూడ, దోమల గూడ, కిస్మత్పూర్, హిమాయత్సాగర్, రాజేంద్ర నగర్, మెహిదీపట్నం, మైలార్ దేవ్పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంబర్పేట్, రాంనగర్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వాన సమస్యలపై ఈవీడీఎంకు 24 కంప్లయింట్లు వచ్చాయి. అలాగే మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మోస్తరుగా వాన పడింది.